తమిళనాడుకు సినీ తారల విరాళాలు...
చెన్నైకి... టాలీవుడ్ సాయం!
వర్షాలు,
వరదలతో చెన్నై నీట మునగడాన్ని చూసి టాలీవుడ్ తట్టుకోలేకపోయింది. చెన్నై
ప్రజలు ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాలని ధైర్యం చెబుతోంది. తన వంతుగా
ఆర్థిక సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకుంటోంది. కళాకారులకు భాషాభేదం
ఉండదని అంటారు. ఆ విషయాన్ని ఈ మధ్యనే కోలీవుడ్ హీరోలు నిరూపించారు.
ఆంధ్రప్రదేశ్ను హుద్హుద్ తుఫాను అల్లకల్లోలం చేసినప్పుడు కోలీవుడ్
హీరోలు తమ వంతు సాయాన్ని అందించి అండగా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ వంతు
రావడంతో అగ్రహీరోలు పోటాపోటీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తమ చిన్నతనంలో
చెన్నైలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. టాలీవుడ్కి చెన్నైతో
అనుబంధం ఎక్కువే. తెలుగు సినిమా పుట్టి పెరిగింది చెన్నైలోననే విషయం
గమనార్హం. మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నందమూరి కల్యాణ్రామ్,
రవితేజ, సాయిధరమ్తేజ్, వరుణ్ తేజ్తో పాటు పలువురు హీరోలు తమ వంతు
సాయాన్ని ప్రకటిస్తున్నారు.
*
రూ.10లక్షలు అందించిన మహేశ్ మాట్లాడుతూ ‘‘భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో
ఇబ్బందులను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితుల నుంచి
త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
*
నందమూరి సోదరులు ఎన్టీఆర్ (రూ.10లక్షలు), కల్యాణ్ రామ్ (రూ.5లక్షలు)
మాట్లాడుతూ ‘‘చెన్నైతో మాకున్న అనుబంధం మరువలేనిది. అలాంటి మహానగరం గురించి
ఇప్పుడు వస్తున్న వార్తలను, అక్కడి ఫోటోలను చూస్తుంటే చాలా బాధగా ఉంది.
ప్రజలు ధైర్యంగా ఉండాలి. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన
తరుణమిది’’ అని చెప్పారు.
* రూ.25లక్షలు
ప్రకటించిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘నా 18వ ఏట వరకు నేను చెన్నైలోనే
గడిపాను. ఇవాళ నేనీస్థాయిలో ఉండటానికి చెన్నై నగరమే కారణం. ఐ లవ్యూ
చెన్నై’’ అని చెప్పారు.
* రూ.5లక్షలను అందించిన రవితేజ మాట్లాడుతూ ‘‘చెన్నైకు నా వంతుగా రూ.5లక్షల సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతాను’’ అని చెప్పారు.
*
రూ.3లక్షలు అందించిన వరుణ్తేజ్ మాట్లాడుతూ ‘‘నేను పుట్టి పెరిగింది
చెన్నైలోనే. చెన్నై నీట మునగడం నన్నెంతగానో కలచివేసింది’’ అని అన్నారు.
*సాయిధరమ్తేజ్
మాట్లాడుతూ ‘‘దాదాపు రూ.3లక్షలు విలువ చేసే దుస్తులు, భోజన పాకెట్లను నా
ఫ్రెండ్స్ ద్వారా అక్కడ పంపిణీ చేస్తున్నాం’’ అని తెలిపారు.
*నిర్మాత ప్రతాప్ కోలగట్ల లక్ష రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించారు.
*సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు విరాళాన్ని ప్రకటించారు.
అలాగే
తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.10 లక్షలు, ధనుష్ రూ.5 లక్షలు, ప్రభు
రూ.5 లక్షలు, శివ కార్తికేయన్ రూ.5 లక్షలు విరాళాలను అందజేసిన విషయం
తెలిసిందే.
No comments:
Post a Comment